ఈ రైతు మామూలోడు కాదు.. దెబ్బకు మహిళా వీఆర్వో ఉద్యోగం పోయింది.
ఈ రైతు మామూలోడు కాదు.. దెబ్బకు మహిళా వీఆర్వో ఉద్యోగం పోయింది, ఏడేళ్లు జైలు శిక్ష
రూ.5వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగం పోగొట్టుకుని జైలు పాలయ్యారు ఓ మహిళా వీఆర్వో. 2018నాటి ఈ కేసులో వీఆర్వోకు తాజాగా జైలు శిక్ష పడింది. 2018లో కడప జిల్లా నుంచి చిలకలూరిపేటకు 765 కేవీడీసీ ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు చేసింది.
ఈ లైన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కడప జిల్లా వల్లూరుకు చెందిన రైతు మల్లికార్జున రెడ్డి పంట నష్టపోయారు. తనకు నష్టపరిహారం చెల్లించాలని వీఆర్వో గంగమ్మను కలిశారు. అయితే పరిహారానికి సంబంధించిన ఫైల్ తహసీల్దార్కు, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు పంపేందుకు ప్రాసెస్ చేయడానికి రూ.5వేలు లంచం ఇవ్వాలని రైతును డిమాండ్ చేశారు.
రైతు మల్లికార్జున్ రెడ్డి లంచం ఇవ్వడం ఇష్టం లేదు.. వెంటనే ఏసీబీ అధికారుల్ని కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశారు. 2018 ఫిబ్రవరి 20న వీఆర్వో గంగమ్మ రైతు మల్లికార్జున రెడ్డి నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా.. నేరం రుజువు కావడంతో కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. రూ.5వేల కోసం కక్కుర్తిపడితే వీఆర్వో ఉద్యోగం పోయి జైలు పాలయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమెకు జైలు శిక్ష పడింది.
ఇటీవల కాలంలో కడప జిల్లాలో ఏసీబీ అధికారులు నిఘా పెంచారు.. లంచం తీసుకుంటున్న అవినీతి అధికారుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మూడు నెలల క్రితం డిప్యూటీ తహసీల్దార్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇనాం భూముల
ఆన్లైన్కు సంబంధించిన వ్యవహారంలో లంచం డిమాండ్ చేసి దొరికిపోయారు. కడప జిల్లాలోని సింహాద్రిపురం పోలీసు స్టేషన్లో ఎస్సై అనిల్ కుమార్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కొద్ది రోజుల తర్వాత పులివెందుల రూరల్ సీఐ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ టార్గెట్గా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సీఐని, ఎస్సైను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.