ఈఎంఐ బకాయి పడితే ఫోన్ లాక్ చేయలేరు!
ఈఎంఐ బకాయి పడితే ఫోన్ లాక్ చేయలేరు! రుణ వసూళ్లకు ఆర్బీఐ కొత్త నిబంధనలు..
వినియోగదారుల గోప్యతకు పెద్దపీట ముంబయి: ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమయ్యాయనే కారణంతో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ వంటి పరికరాలను రుణదాతలు ఇష్టానుసారంగా దూరం నుంచే నిలిపివేయడానికి వీలుండదు. రుణ వసూళ్ల ప్రక్రియలో వినియోగదారుల హక్కులు, వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించేలా భారతీయ రిజర్వు బ్యాంకు పలు నిబంధనలను స్పష్టం చేసింది. పరికరాన్ని కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా తీసుకున్న రుణం విషయంలోనే పరికరంపై పరిమితులు విధించే అంశం వర్తిస్తుంది. సాధారణ వ్యక్తిగత రుణం తీసుకున్న వ్యక్తి ఫోన్ను బకాయి వసూళ్ల కోసం లాక్ చేయడం వంటి చర్యలకు అవకాశం ఉండదు. దశలవారీగా పరిమితులు: పరికరం కొనుగోలుకు తీసుకున్న రుణంలో ఈఎంఐలు చెల్లించకపోతే వెంటనే ఫోన్ను పూర్తిగా పనిచేయకుండా చేయడం కాకుండా, పరిస్థితిని బట్టి దశలవారీగా పరిమితులు విధించే విధానాన్ని అనుసరించాలి. రుణగ్రహీతకు బకాయి వివరాలు, తదుపరి చర్యల గురించి స్పష్టమైన సమాచారం అందించాల్సి ఉంటుంది. రుణ వసూళ్లలో రుణదాతలు అనుసరించే విధానం పారదర్శకంగా ఉండాలని ఆర్బీఐ సూచించింది. అత్యవసర సేవలు కొనసాగాల్సిందే: పరికరంపై ఏవైనా పరిమితులు విధించినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సేవలను పూర్తిగా నిలిపివేయకూడదు. అత్యవసర కాల్స్, సందేశాలు, ఇతర కీలక సమాచార సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాల్సి ఉంటుంది. వ్యక్తి ఉద్యోగం లేదా వృత్తి కార్యకలాపాలకు అవసరమైన ముఖ్యమైన సదుపాయాలను కూడా అనవసరంగా నిలిపివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత సమాచారం జోలికి వెళ్లొద్దు: రుణ బకాయిల వసూళ్ల కోసం వినియోగదారుల ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని రుణదాతలు అనధికారికంగా పరిశీలించకూడదు. ఫోన్లో ఉన్న పరిచయాల జాబితా, ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సందేశాలు, కాల్ వివరాలు, ప్రాంత సమాచార చరిత్ర వంటి గోప్యమైన సమాచారాన్ని రుణ వసూళ్ల కోసం ఉపయోగించడానికి వీలుండదు. వినియోగదారుల గోప్యతను కాపాడటం రుణదాతల బాధ్యతగా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రికవరీ ఏజెంట్లపై నిఘా: రుణ బకాయిల వసూళ్లకు బయట సంస్థలు లేదా రికవరీ ఏజెంట్లను నియమించే ముందు సంబంధిత సంస్థలపై బ్యాంకులు తగిన పరిశీలన జరపాలి. రుణ వసూళ్ల పేరుతో వినియోగదారులను బెదిరించడం, వేధించడం, అవమానించడం లేదా పదేపదే ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు అవకాశం ఇవ్వకూడదు. రుణగ్రహీతలను సంప్రదించే సమయంపైనా ఆర్బీఐ పరిమితులు విధించింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకే: రికవరీ ఏజెంట్లు సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. అర్ధరాత్రి, తెల్లవారుజామున వంటి సమయాల్లో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా బ్యాంకులు తమ రికవరీ వ్యవస్థను పర్యవేక్షించాలి. ఫోన్ సంభాషణల రికార్డు: రుణ వసూళ్లకు సంబంధించి రికవరీ ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్ను రుణదాతలు రికార్డు చేసి భద్రపరచాలి. ఏజెంట్లు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది బ్యాంకులు నిరంతరం పరిశీలించాలి. రుణ వసూళ్ల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు వినియోగదారులపై అనవసర ఒత్తిడిని తగ్గించడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. ఏ రుణానికైనా వర్తించదు: ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ పరికర పరిమితుల నిబంధనలు ప్రతి రుణానికి వర్తించవు. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ వంటి పరికరాన్ని కొనుగోలు చేయడానికి నేరుగా తీసుకున్న రుణం విషయంలోనే ఈ అంశం పరిగణనలోకి వస్తుంది. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న సాధారణ రుణానికి ఈ నిబంధనను వర్తింపజేసి ఫోన్ను నిలిపివేయడం సాధ్యం కాదు. బకాయి చెల్లించాల్సిన బాధ్యత మాత్రం ఉంటుంది: ఆర్బీఐ నిబంధనలు రుణగ్రహీతలు ఈఎంఐలు చెల్లించాల్సిన బాధ్యతను తొలగించవు. రుణం తీసుకున్న వ్యక్తి ఒప్పందం ప్రకారం బకాయిలను చెల్లించాల్సిందే. అయితే బకాయిల వసూళ్ల పేరుతో రుణదాతలు వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించకుండా, బెదిరింపులు లేదా వేధింపులకు పాల్పడకుండా నిబంధనలకు లోబడి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రుణ వసూళ్లలో క్రమశిక్షణతో పాటు వినియోగదారుల హక్కులకు సమాన ప్రాధాన్యం ఇవ్వడమే తాజా మార్గదర్శకాల ఉద్దేశంగా కనిపిస్తోంది.