ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
విరూపాక్షి అరెస్టు నేపథ్యంలో కర్నూలు పర్యటన.. వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
కర్నూలు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జగన్ కర్నూలుకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తెలిపారు.
ఆదివారం కర్నూలులో మాట్లాడిన తలశిల రఘురామ్.. కూటమి ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను అరెస్టు చేసిన తీరును జగన్ తప్పుబడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ పర్యటనలో విరూపాక్షి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు, తాజా రాజకీయ పరిణామాలపై జగన్ స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విరూపాక్షి అరెస్టు వ్యవహారం ఇప్పటికే కూటమి, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలకు దారితీస్తుండటంతో జగన్ కర్నూలు పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.