ఎంసీసీని పరిరక్షించి, పునరుద్ధరించాలి: హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించిన మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ)ని పరిరక్షించి, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థ ద్వారా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హింద్ మజ్దూర్ సభ (HMS) జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసీసీ కోసం కేటాయించిన సుమారు 438 ఎకరాల పారిశ్రామిక భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలు కాకుండా కాపాడాలని కోరారు. అలాగే మూతపడిన కంపెనీపై ఆధారపడిన కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ బకాయిలను తక్షణమే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
రామగుండం ఎరువుల కర్మాగారం, కాగజ్నగర్ పేపర్ మిల్లులను ప్రభుత్వం చొరవతో పునరుద్ధరించిన తరహాలోనే, ఎంసీసీని కూడా తెరిపించి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ప్రత్యేక లేఖ ద్వారా తీసుకెళ్లాలని, ప్లాంట్ భవిష్యత్తుపై ప్రజా, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షులు ఎం.డి. షఫీ, జిల్లా కార్యదర్శి తగరం శ్రీనివాస్, నాయకులు ఎం.డి. ఉస్సెన్, దున్నపోతుల రమేష్, పల్లపు శ్రీనివాస్, చల్ల మోహన్, చిప్పకుర్తి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు