ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో సత్వరమే పరిష్కరించేలా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీలతో కలిసి ఆయన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత అధికారులు బాధ్యతగా తీసుకుని జాప్యం లేకుండా పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. చెన్నూరు పట్టణానికి చెందిన వ్యాపారి లింగ కృష్ణ అన్లోడింగ్ సమయంలో హమాలీలు అధిక ధరలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని, మంచిర్యాలకు చెందిన దోమల చంద్రశేఖర్ మందమర్రిలో చదువుతున్న తన కూతురును మంచిర్యాల వసతి గృహానికి బదిలీ చేయాలని విన్నవించారు. మంచిర్యాల ఎన్టీఆర్ నగర్కు చెందిన చిలుక పద్మ శిథిలావస్థకు చేరిన తన ఇంటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, బెల్లంపల్లికి చెందిన మాగంటి సౌభాగ్యవతి భూభారతి పోర్టల్లో పాస్ పుస్తకం సవరణ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, మందమర్రి మండలం అమరవాదికి చెందిన తోటపల్లి లత తన భర్త మరణించినందున జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు.
వ్యక్తిగత సమస్యలతో పాటుగా పలు సామాజిక సమస్యలపైనా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. నెన్నెల మండలం కోనంపేట రైతులు ముఖ్యమంత్రి గిరి వికాస్ పథకం కింద తమకు మంజూరైన బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కోరారు. బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లిలో అనుమతులకు మించి జరుగుతున్న మట్టి తవ్వకాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మందమర్రి మండలం గద్దెరాగడికి చెందిన గొట్టే నరేందర్ డిమాండ్ చేశారు. జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన సముద్రాల శంకర్ తమ గ్రామంలోని చెరువులపై జరిగిన ఆక్రమణలను తొలగించి, వాటిని పునరుద్ధరించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని దరఖాస్తు అందజేశారు