సివిల్ సప్లై కార్మికుల వేతనాలు ఒకేసారి చెల్లించాలి
బడ్జెట్ సాకుతో విడతల వారీగా ఇవ్వడం అన్యాయం: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల దాసు
మంచిర్యాల :సివిల్ సప్లై (పౌర సరఫరాల) శాఖలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించాలని ఏఐటీయూసీ (AITUC) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మేకల దాసు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన సివిల్ సప్లై కార్మికులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. కార్మికులకు నెలకు రెండుసార్లు కాకుండా ఒకేసారి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లేదనే సాకుతో కార్మికుల కష్టార్జితాన్ని విడతల వారీగా చెల్లించడం దారుణమన్నారు. ఇది కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కార్మికుల వేతనాల చెల్లింపులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు