నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలని వినతి
చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం: నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల స్థలంలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరుతూ ఎస్ఎంసీ కమిటీ సభ్యులు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ జి. నాగరాజు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ఆక్రమణల కారణంగా భవిష్యత్తులో పాఠశాల అవసరాలకు అదనపు భవనాలు నిర్మించేందుకు స్థలం కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే పాఠశాల స్థలంలో కాలనీలు నిర్మించబడటంతో, ఆదివారాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్ఎంసీ కమిటీ వైస్చైర్మన్ డి. లలిత, సభ్యులు వి. లావణ్య, ఎం. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.