చాట్రాయి మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం
చాట్రాయి, జూన్ 22: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు, రెవెన్యూ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు గ్రామాల్లోని ప్రతి రైతు కుటుంబాన్ని సందర్శించి అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య రంగాలు కీలకమని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో సుమారు 35 శాతం వాటా ఈ రంగాలదేనని తెలిపారు.
రైతు కుటుంబాల సర్వే ఆధారంగా రానున్న ఐదేళ్లలో రైతుల అభివృద్ధికి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయ సాంకేతికత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మద్దతు ధరలు అనే ఐదు ప్రధాన అంశాలపై కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు.
డ్రిప్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులు, పశుసంపద అభివృద్ధి, మత్స్య సంపద ప్రోత్సాహం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల ఆన్లైన్ పంపిణీ వ్యవస్థ, సమతుల్య ఎరువుల వినియోగంపై సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
చిన్నంపేట, బూరుగుడెం గ్రామాల్లో రైతులతో నిర్వహించిన సమావేశాల్లో వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.