ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్లలో దొంగతనాలు పెరుగుదల – పోలీసులపై ప్రజల ఆగ్రహం
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కంచికచర్ల మండలంలో దొంగతనాల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నక్కలంపేట గ్రామంలో దొంగతనం జరిగి పది రోజులు గడిచినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దొంగతనాల భయంతో గ్రామ ప్రజలు ఇంట్లోని విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ప్రజలు చెబుతున్నారు.
గతంలో కంచికచర్ల సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్కు సమీపంలో ఉన్న వాసవి జ్యూయెలర్స్లో 350 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి దొంగతనం జరిగిన ఘటన ఇంకా వెలుగులోకి రాకపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో జరిగిన ఈ కేసు కూడా ఇంకా చేదించలేదని సమాచారం.
అలాగే వసంతకాలనీలో ఒక మహిళపై బైక్పై వచ్చిన దొంగలు మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయిన ఘటన కూడా చోటుచేసుకుంది. పరిటాల అంజినేయ స్వామి దేవస్థానంలో జరిగిన దొంగతనం కేసు కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదని బాధితులు పేర్కొంటున్నారు.
దొంగతనాల నియంత్రణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నిందితులను త్వరగా పట్టుకుని భద్రత కల్పించాలని ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.