గడ్డి మందులపై నిషేధం విధించాలి: రైతు కమిషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి, కలుపు మందులను తక్షణమే నిషేధించాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రైతు కమిషన్ బృందం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి నివేదికను అందజేసింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70కు పైగా దేశాల్లో ఈ ప్రమాదకర రసాయనాలను ఇప్పటికే నిషేధించినప్పటికీ, మన దేశంలో ఇవి ఇంకా విచ్చలవిడిగా విక్రయమవుతున్నాయని కమిషన్ తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ, తండా ప్రాంతాల్లో రైతులు క్షణికావేశంలో ఈ మందులను తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విష రసాయనాలను నిషేధించాల్సిన అవసరం ఉందని, వైద్యుల సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయని కమిషన్ పేర్కొంది. తెలంగాణలో ఈ మందుల విక్రయాన్ని వెంటనే నిలిపివేయడంతో పాటు, దేశవ్యాప్తంగా నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని రైతు కమిషన్ విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతకమైన విష రసాయనాలపై రాష్ట్రంలో నిషేధం విధించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.