భట్టి విక్రమార్క కాదు.. ఆయన 'బకాయి' విక్రమార్క: నడిపెల్లి దివాకర్ రావు
ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం
స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం
రాజకీయ కక్షతోనే విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనుల అడ్డగింపు
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులతో కలిసి మీడియా సమావేశం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాలనీలో గల తన నివాసం వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డారు కాబట్టి.. ఉపముఖ్యమంత్రి పేరు భట్టి విక్రమార్క కాదని, ఇకపై ఆయనకు 'బకాయి' విక్రమార్క అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారిపై, బీఆర్ఎస్ పార్టీపై అనేక అబద్ధాలు ఆడి కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చారని, సింగరేణి అన్యాయాలను ఎత్తిచూపుతున్న మాజీ మంత్రి హరీష్ రావును విమర్శించే అర్హత వారికి లేదని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దివాకర్ రావు అన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటే ప్రజలందరూ గుండాయిజం, రౌడీయిజం, దాడులు, భూకబ్జాలకు పాల్పడాలని ప్రేరేపిస్తున్నారా? అని ప్రశ్నించారు. కేవలం రెండున్నరేళ్లలోనే రూ. 500 కోట్ల బ్యాంకు అప్పులను ఎమ్మెల్యే ఎలా తీర్చారో, నియోజకవర్గంలో ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు అక్రమాలు, అవినీతికి పాల్పడుతూ కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, తనకు పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన రూ. 1.97 కోట్లతో విశ్వనాథ ఆలయ పనులు చేయకుండా అడ్డుకున్నారని, ఆలయం ముందున్న షాపులను కూలగొట్టడం ద్వారా రోజుకు రూ. 2 లక్షల ఆదాయానికి గండికొట్టారని మండిపడ్డారు. కూలగొడితే అభివృద్ధి కాదని, వేల కోట్లు లూటీ చేసిన వారిని ఆదర్శంగా తీసుకుంటే తెలంగాణ నాశనమవుతుందన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి నియోజకవర్గాల్లోని సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వేలాది మందికి ఇంటి పట్టాలు అందించామని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారికి పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రిటైర్డ్ సింగరేణి కార్మికుల ఇళ్ల నిర్మాణానికి ఇస్తామన్న రెండు గుంటల భూమి హామీని కూడా గాలికొదిలేసిందని విమర్శించారు. కారుణ్య నియామకాలను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్దేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, గత ముఖ్యమంత్రుల (వైఎస్సార్, ఎన్టీఆర్) అభివృద్ధిని అసెంబ్లీలో ప్రశంసించిన సంస్కారం కేసీఆర్ గారిదని, కానీ ఆయనపై అక్కసుతో రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో ప్రస్తావించడం లేదని ఆక్షేపించారు. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు మళ్లీ కేసీఆర్ 'కారు' గుర్తుకే ఓటేసి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు