గద్వాల మార్కెట్ యార్డులో భారీగా గంజాయి పట్టివేత
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సుమారు 6 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు, దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది.
గంజాయి పట్టుబడిన ఘటనతో గద్వాల పట్టణంలో మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి వ్యాపారం జరుగుతోందా అనే అంశంపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, గంజాయి సరఫరా మార్గాలపై మరింత నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి రహిత గద్వాల కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.