గద్వాలలో 21 ఏళ్ల తర్వాత న్యాయం కోసం తల్లి ధర్నా.. కొడుకు తండ్రిని అంగీకరించాలని డిమాండ్
గద్వాల జిల్లా: కొడుకు పుట్టిన 21 ఏళ్ల తర్వాత తన కుమారుడికి తండ్రి నువ్వేనంటూ ఓ మహిళ నిరసనకు దిగింది. తన కుమారుడిని వెంట పెట్టుకొని ధర్నా చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
గద్వాలకు చెందిన కృష్ణవేణి అనే మహిళ చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఓ కుటుంబంలో పనిచేసేదని తెలిపింది. వయసు వచ్చిన తర్వాత కూడా అదే ఇంట్లో పనిచేస్తుండగా, ఆ ఇంటి యజమాని కుమారుడు తనను లోబర్చుకొని గర్భవతిని చేశాడని ఆరోపించింది.
ఈ విషయం తెలిసిన తర్వాత గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించాడని, అయితే అది విఫలమైందని పేర్కొంది. అనంతరం జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి తనను అక్కడి నుంచి తీసుకెళ్లారని తెలిపింది.
ఆ తర్వాత తాను మగబిడ్డకు జన్మనిచ్చానని, గత 21 ఏళ్లుగా తన కుమారుడిని తన కొడుకుగా అంగీకరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తనను బెదిరిస్తూ, దౌర్జన్యం చేస్తున్నారని, చేతబడి చేయించి చంపేస్తామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికైనా తన కుమారుడికి తండ్రిగా అతడు అంగీకరించి న్యాయం చేయాలని కృష్ణవేణి డిమాండ్ చేసింది. ఈ ఘటనపై అధికారుల జోక్యం కోరింది.