గంగానమ్మ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
గంగానమ్మ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
ఏలూరు జిల్లా, కామవరపుకోట: కామవరపుకోట మండలం కొత్తగూడెం–కామవరపుకోట ప్రధాన రహదారి మధ్యలో ఉన్న గంగానమ్మ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలతో భారీగా మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ మట్టి తవ్వకాలపై ప్రశ్నించిన గ్రామస్తులకు నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తూ, "మా ఇష్టం... ఏం చేసుకుంటారో చేసుకోండి" అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శించారు. గంగానమ్మ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేసి, మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేశారు.