గూడూరు పాత బస్టాండ్లో హైర్ బస్సుల నిర్లక్ష్యం..
గూడూరు పాత బస్టాండ్లో హైర్ బస్సుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
నెల్లూరు జిల్లా గూడూరు పాత బస్టాండ్లో ఆర్టీసీ హైర్ బస్సుల నిర్వహణపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వైపు వెళ్లే వెంకటగిరి డిపోకు చెందిన కొన్ని హైర్ బస్సులు అధికారికంగా ఆగాల్సిన బస్టాప్లో ఆగకుండా వెళ్లిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.
ప్రయాణికులను ఎక్కించకుండా ఖాళీగానే బస్సులు వెళ్లిపోతున్నాయని, దీనిపై ప్రశ్నించిన వారికి కొందరు డ్రైవర్లు దురుసుగా సమాధానాలు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. "ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ప్రయాణికులు తెలిపారు.
ప్రజా రవాణా సేవలు మెరుగుపరచాల్సిన హైర్ బస్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ప్రజా సేవ కోసం అద్దె ప్రాతిపదికన నడుస్తున్న బస్సులు నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజలే నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూడూరు పాత బస్టాండ్లో ఈ సమస్య రోజూ పునరావృతమవుతోందని, రవాణా శాఖ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని హైర్ బస్సులు తప్పనిసరిగా బస్టాప్లో ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.