గ్రామీణ ప్రాంతాలకు వరం.. ద్విచక్ర వాహన అంబులెన్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు
న్యూఢిల్లీ, ఆగస్టు 6: గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు వీలు కల్పించేలా కేంద్ర మోటారు వాహన నిబంధనలు–1989లో సవరణలు చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ ప్రతిపాదన ప్రకారం ఎల్–2 కేటగిరీకి చెందిన ద్విచక్ర వాహనాలను ప్రత్యేక ప్రమాణాలకు అనుగుణంగా అంబులెన్సులుగా మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. ఇలాంటి బైక్ అంబులెన్సులు ఇరుకైన రహదారులు, కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు త్వరగా వైద్య సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ముసాయిదా నోటిఫికేషన్పై ప్రజలు, నిపుణులు, సంబంధిత సంస్థలు 30 రోజులలోగా తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని కేంద్రం పేర్కొంది. అందిన సూచనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ను జారీ చేయనుంది.
ఈ నిబంధనలు అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు, గుండెపోటు, ప్రసవ అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో తొలి దశ వైద్య సేవలు మరింత వేగంగా అందించే అవకాశం ఏర్పడనుంది. అలాగే సాధారణ అంబులెన్సులు చేరుకోలేని ప్రాంతాల్లో ద్విచక్ర వాహన అంబులెన్సులు అత్యవసర వైద్య సేవలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.