గుంటూరు ఆసుపత్రి నుంచి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అరెస్ట్
గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీసులను మోసం చేసి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అలియాస్ అజిత్ కుమార్ను పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. గత నెల 28న ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయిన అతడి కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి.
ఓఎల్ఎక్స్ వేదికగా భారీ మోసాలకు పాల్పడి అనేక మందిని మభ్యపెట్టిన కేసుల్లో భీముడు నిందితుడిగా ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అమాయక ప్రజలను మోసం చేయడంలో అతడు నైపుణ్యం సంపాదించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడులో అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలిస్తున్నారు. భీముడు అరెస్టుతో అతడు పాల్పడిన మరిన్ని మోసాల వివరాలు, ఇతర సహచరుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు