గుంటూరు పశ్చిమలో రేషన్ మాఫియాపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి ఉక్కుపాదం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. రామనామ క్షేత్రం సమీపంలో రేషన్ షాప్ నంబర్–150 పరిధిలో అక్రమంగా తరలింపుకు సిద్ధం చేసిన 100కు పైగా రేషన్ బస్తాలను స్వయంగా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్న విషయం తెలుసుకున్న అక్రమార్కులు పరారవగా, వాహన డ్రైవర్ పోలీసులకు చిక్కాడు.
18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉల్లి గోపాల్ కృష్ణ ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎమ్మెల్యే పరిస్థితిని పరిశీలించి వెంటనే లాలాపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రేషన్ బియ్యం లోడ్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి లాభాలు పొందే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గతంలో కూడా నల్లచెరువు, నల్లకుంట ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాను స్వయంగా అడ్డుకుని కేసులు నమోదు చేయించినట్లు గుర్తుచేశారు. అనంతరం పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించడంతో పాటు ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని, అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, దుర్వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.