చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుపై మండిపడిన -బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ ర్రాఘవేంద్ర రాజు
డిసెంబర్ 23న బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ముఖ్య కారణాలుగా మహిళలపై దాడులు, లా అండ్ ఆర్డర్ వైఫల్యాలు ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ను పూర్తిగా నియంత్రిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన అనంతరం గత 20 నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులను గాలికి వదిలేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలు, చిన్నపిల్లలపై దాడులు, అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ మహిళల భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
ఇటీవల తన కుటుంబానికి సంబంధించిన ఒక సంఘటనను ఉదాహరణగా ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం తాను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా, తన కుమార్తె స్నేహితులు కారులో ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారును వెంబడించి పుంగనూరు వరకు వచ్చి అడ్డగించారని తెలిపారు. కారును నడిపిస్తున్న డ్రైవర్ అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్నప్పటికీ దుర్భాషలాడుతూ, బాలికలను బెదిరించారని చెప్పారు. స్థానికులు జోక్యం చేసుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించారు.
ఈ విషయం తనకు తెలియగానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించగా, ఫిర్యాదు అనంతరం ఇబ్బంది పెట్టిన వ్యక్తిని మరియు తన సిబ్బందిని స్టేషన్కు పిలిపించి సద్దిచెప్పి పంపించారని తెలిపారు. అయితే ఆ తరువాత మళ్లీ తన సిబ్బందిని అడ్డగించి గొడవలకు దిగారని అన్నారు. ఈ సమస్య అక్కడితో ముగిసిందని భావించిన సమయంలో జిల్లా ఎస్పీ ఈ వ్యవహారాన్ని స్వయంగా టేకప్ చేసి, తన సిబ్బంది మరియు డ్రైవర్లను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.
ఆడబిడ్డలు ప్రయాణిస్తున్న కారును వెంబడించి అడ్డగించిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని, అతన్ని అరెస్టు చేయలేదని మండిపడ్డారు. కానీ రివర్స్లో తన సిబ్బందిని రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి, మరుసటి రోజు కూడా డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.
నిజంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే కానీ, ఉద్దేశపూర్వకంగా తమ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తనపై 30 తప్పుడు కేసులు పెట్టారని, అప్పట్లో చంద్రబాబు నాయుడే అవి తప్పుడు కేసులని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ఉన్నట్లే ఈ ప్రభుత్వంలో కూడా గంజాయి, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మహిళల భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని బోడె రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube