Hydra: మురికి కూపం నుంచి.. జలకళ వరకు!
రూపురేఖలు మార్చుకున్న ఉప్పల్ నల్లచెరువు.. నెలాఖరులోపు ప్రారంభానికి సన్నాహాలు
హైదరాబాద్ | Ntoday News
హైదరాబాద్ నగరంలోని చెరువుల రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. ఒకప్పుడు చెత్త, మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ముళ్లపొదలతో మురికి కూపాలుగా కనిపించిన చెరువులు ఇప్పుడు జలకళతో కళకళలాడుతున్నాయి. చెరువుల అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం, విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా పనులు చేపడుతున్నారు.
ఇప్పటికే మూడు చెరువులు ప్రారంభం కాగా.. మరో మూడు చెరువులను ఈ నెలాఖరులోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఉప్పల్ నల్లచెరువుకు కొత్త రూపు
ఉప్పల్ నల్లచెరువు రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఆక్రమణల కారణంగా గతంలో 52.30 ఎకరాలకు పరిమితమైన చెరువు విస్తీర్ణాన్ని 67.31 ఎకరాలకు హైడ్రా పెంచింది. చెరువు చుట్టూ 2.4 కిలోమీటర్ల బండ్తో పాటు వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేశారు.
అన్ని వయసుల వారు సేదతీరేలా చెరువు చుట్టూ గజీబోలు, కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. వరద నీరు సులభంగా చెరువులోకి చేరేలా ఇన్లెట్లు, చెరువు నిండిన తర్వాత పరిసర ప్రాంతాలకు వరద ముప్పు లేకుండా ఔట్లెట్ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించే విషయంలో ఎలాంటి సడలింపు లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తమ్మిడికుంట, సున్నం చెరువుల పనుల పరిశీలన
మాధాపూర్లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తమ్మిడికుంటలో పేరుకుపోయిన బయో వ్యర్థాలను తొలగించడంతో పాటు మురుగునీటిని పూర్తిగా తొలగించినట్లు అధికారులు వివరించారు. మెటల్ చార్మినార్ వైపు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేసే యూనిట్లు ఉన్నాయని, వాటి వల్ల చెరువుకు కాలుష్య ముప్పు ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే హెచ్చరించినట్లు తెలిపారు.
దీంతో అక్కడ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వేరు చేసే కేంద్రాలను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు.
సున్నం చెరువు పరిసరాలను కూడా పరిశీలించిన ఆయన.. చెరువు బండ్పై వ్యూపాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టూ మరింత పచ్చదనం పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు.
కృష్ణకాంత్ పార్క్ చెరువుపైనా దృష్టి
అంతకుముందు హైడ్రా కమిషనర్ కృష్ణకాంత్ పార్కును పరిశీలించారు. రెండో విడతలో అభివృద్ధి చేస్తున్న 14 చెరువుల్లో ఇది కూడా ఒకటిగా ఉందని తెలిపారు.
కృష్ణకాంత్ పార్క్ చెరువు లోతు, విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా వరద నీటిని చాలావరకు నియంత్రించవచ్చని పేర్కొన్నారు. నేరుగా వరద నీరు చెరువులోకి చేరేలా చర్యలు చేపడితే కృష్ణానగర్, యూసుఫ్గూడ ప్రాంతాలతో పాటు చెరువు దిగువన ఉన్న శ్రీనివాసనగర్, అమీర్పేట ప్రాంతాల్లో నీట మునిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
నగరంలోని చెరువులను సంరక్షించడంతో పాటు వాటిని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే ప్రాంతాలుగా తీర్చిదిద్దే దిశగా హైడ్రా చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయి.