పోచారం కాంగ్రెస్ లో ముదురుతున్న అసమ్మతి !
పోచారం కాంగ్రెస్ లో ముదురుతున్న అసమ్మతి !
పోచారం డివిజన్ అధ్యక్షుడిపై ఫిర్యాదులు వెల్లువ..
క్షమాపణ చెప్పించాలంటూ మోటుపల్లి వెంకట్ డిమాండ్!
ఎన్ టుడే న్యూస్ ఘట్కేసర్ :
ఘట్కేసర్సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని నారాపల్లిలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో కార్యకర్తల పట్ల పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. బైక్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలకు బైకులు వరుసలో పెట్టాలని సూచించే క్రమంలో అసభ్య పదజాలంతో, అమానుషంగా దూషించారని పార్టీ సీనియర్ నాయకుడు, రేవంతన్న టీం సభ్యుడు మోటుపల్లి వెంకట్ ఆరోపించారు. పార్టీ కోసం కార్యక్రమాలకు హాజరైన కార్యకర్తలను గౌరవంగా నడిపించాల్సిన బాధ్యత కలిగిన నాయకుడే ఈ విధంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని ఆయన మండిపడ్డారు. “కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే నాయకత్వాన్ని పార్టీ ఎంతమాత్రం సహించకూడదు. వెంటనే కార్యకర్తలకు బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి” అని మోటుపల్లి వెంకట్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పోచారం డివిజన్లోని పార్టీ నాయకులను, సీనియర్ కార్యకర్తలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ వ్యవస్థను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం... వారినే అవమానించే నాయకత్వాన్ని పార్టీ ఎలా సహిస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఐకమాండ్ స్పందించి అధ్యక్షుడు పై తగిన చర్యలు తీసుకుని, కార్యకర్తలకు క్షమాపణ చెప్పించాలని కోరారు. లేనిపక్షంలో కార్యకర్త లందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని మోటుపల్లి వెంకట్ హెచ్చరించారు. కార్యకర్తల గౌరవం, పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే వ్యవహారాలపై అధిష్ఠానం వెంటనే స్పందించి, వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకో వాలని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.