ఇంకా కచ్చా రోడ్లేనా..? ఇరవై ఏళ్లు దాటినా వైఎస్సార్ కాలనీలో మారని దుస్థితి
ఇంకా కచ్చా రోడ్లేనా..? ఇరవై ఏళ్లు దాటినా వైఎస్సార్ కాలనీలో మారని దుస్థితి
రోడ్లు లేవు.. డ్రైనేజీ లేదు.. తాగునీటికీ తీరని కష్టాలు
చింతలపూడి: పట్టణంలో కాలనీలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా, పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మాత్రం ఇప్పటికీ కలగానే మిగిలాయి. గుప్తా మిల్ వెనుక ఉన్న వైఎస్సార్ కాలనీ 2004లో ఏర్పడినా, ఇరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా అక్కడి ప్రజలు కనీస వసతుల కోసం ఎదురు చూస్తున్నారు.
కాలనీలో ఇప్పటికీ కచ్చా రోడ్లే ఉండటంతో వర్షం పడితే అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సదుపాయం కూడా లేక, వచ్చే నీరు మురికిగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారుల అభివృద్ధికే పరిమితమవుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లోని సమస్యలను పూర్తిగా విస్మరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే దుస్థితి పునరావృతమవుతున్నా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వైఎస్సార్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం వంటి కనీస మౌలిక వసతులను వెంటనే కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.