తుక్కుగూడ నర్సు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
దర్యాప్తును వేగవంతం చేయాలని.. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం అందించాలని సూచన
హైదరాబాద్ | N Today News
హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు నివసిస్తున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ యాజమాన్యం లేదా నిర్వహణలో నిర్లక్ష్యం ఏమైనా ఉందా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలను విచారణలో సమగ్రంగా పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేయాలి
ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమగ్ర ఛార్జ్షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ
బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి విచారణలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండ
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన నిబంధనల అమలుపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.