జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం
జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్, మే 1, 2026: జాతీయ సమైక్యత బలోపేతానికి ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని లోక్ భవన్లో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’లో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వైవిధ్యాల్లో ఏకత్వమే భారతదేశ బలం అని పేర్కొన్నారు. పశ్చిమ భారత అభివృద్ధిలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. సాంస్కృతిక వారసత్వంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ఈ రాష్ట్రాలు విశిష్ట స్థానం సంపాదించాయని అన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం మహారాష్ట్రకు గౌరవాన్ని తీసుకువచ్చిందని, భక్తి సంప్రదాయం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిందని తెలిపారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి మహనీయుల జన్మస్థలమైన గుజరాత్ రాష్ట్రం సేవా భావం, ఆవిష్కరణల దిశగా దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని ప్రశంసించారు.
ఆది శంకరాచార్యులు దేశ సాంస్కృతిక, భౌగోళిక ఐక్యత కోసం కృషి చేశారని గవర్నర్ గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన, సాంస్కృతిక బంధం పెరుగుతోందని తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు తమ మూలాలను కాపాడుకుంటూనే తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు.
అనంతరం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఆవిర్భావ సందేశాలను డిజిటల్ స్క్రీన్పై ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జానకి శుక్లా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్, టీజీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా భగ్వాల్, క్యాట్ సభ్యురాలు డా. లతా బసవరాజ్ పట్నే, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, గుజరాతీ ప్రగతి సమాజ్ ప్రతినిధి మహేష్ పటేల్ పాల్గొన్నారు.
ప్రెస్ సెక్రటరీ, లోక్ భవన్ ద్వారా జారీ చేయబడింది.