జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం
విజయవాడ, విశాఖపట్నంలో బెంచ్ లు ఏర్పాటు..
ఏపీ జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీస్టాట్) అధికారికంగా ప్రారంభమయ్యింది. జీస్టాట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా విజయవాడ లబ్బిపేట బృందావన్ కాలనీలోని వినమ్గర్ అపార్ట్మెంట్స్ (ఫ్లాట్ నంబరు 401) ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం లలో రెండు బెంచ్లు ఏర్పాటయ్యాయి. ఏపీ జీస్టాట్ ఉపాధ్యక్షుడు భాస్కర్రెడ్డి వేమిరెడ్డి, సాంకేతిక సభ్యులు (సెంట్రల్) సతీష్కుమార్ అగర్వాల్ ను ఏపీ జీస్టాట్ బెంచ్లో సభ్యులుగా నియమించారు. విజయవాడ బెంచ్ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు విశాఖపట్నం బెంచ్ పరిధిలో ఉన్నాయి. ఆయా జిల్లాలకు చెందిన పన్ను చెల్లింపుదారులు, శాఖాధికారులు, అధికారిక ప్రతినిధులు, తదితరులు అప్పీళ్లు, అప్లికేషన్లు సంబంధిత బెంచ్ ల వద్ద దాఖలు చేయాల్సి ఉంటుంది.