జిల్లా ఖజానా ఆదాయం పెంచే లక్ష్యాలను అధిగమించాలి
జిల్లా ఖజానా ఆదాయం పెంచే లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి!!..
జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
జిల్లా ఖజానాకు ఆదాయం పెంపు కోసం అన్ని ఆదాయార్జన శాఖలు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో పాటు ఆదాయ వృద్ధి సాధించడం లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ పనుల్లో జీఎస్టీ వసూళ్లు తప్పనిసరిగా జరిగేలా చూడాలని, బిల్లులు ప్రాసెస్ చేసే సమయంలో జీఎస్టీ యాక్టివ్ స్థితిని పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో జరిగే పనులకు ఉపయోగించే ఇంధనాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*అక్రమ మద్యం రవాణాపై కట్టుదిట్టమైన నిఘా*
ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తూ, మద్యం దుకాణాలు, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.
*జీఎస్టీ రిజిస్ట్రేషన్పై అవగాహన కార్యక్రమాలు*
మండల అభివృద్ధి అధికారులు, గ్రామపంచాయతీలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించి, అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*‘రెవెన్యూ వింగ్’తో ప్రత్యేక మానిటరింగ్*
కెఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో "రెవెన్యూ వింగ్" ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి, రోజువారీ పురోగతిని సమీక్షించాలని సూచించారు.
ప్రతి వారం బిల్లుల వివరాలను సేకరించి కమర్షియల్ టాక్స్ శాఖతో మరియు ఇతర శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలని సూచించారు. మైన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, అటవీ తదితర శాఖలు తమ లావాదేవీలను క్రమబద్ధంగా నమోదు చేసి పన్నుల వసూళ్లను పెంచాలని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.