జంజీరాల రాజం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో కీర్తిశేషులు జంజీరాల రాజం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.
బెల్లంపల్లి మండలం చెంద్రవెల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా, బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు బాబుక్యాంప్ బస్తీ కౌన్సిలర్గా, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకుడిగా, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా, తెలంగాణ తొలి దశ మరియు మలి దశ ఉద్యమ కారుడిగా ప్రజలకు విశేష సేవలు అందించిన జంజీరాల రాజం గారిని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
సభలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ జంజీరాల రాజం గారి మరణం బెల్లంపల్లి పట్టణానికి తీరని లోటని, ఆయన చేసిన ప్రజాసేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా “జంజీరాల రాజం అమర్ హై”, “జోహార్ జంజీరాల రాజం” అంటూ నాయకులు నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్య, జి. లక్ష్మణ్, సిహెచ్ శ్రీనివాస్, టీ. మల్లేష్, సాంబమూర్తి, పి. తిరుపతి, గోపన్న, అన్వర్, డి. కిషన్ సింగ్, ఏ. రాజేశం, జంజీరాల నారాయణ, శ్రీరాములు రవి తదితరులు పాల్గొన్నారు.