జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధిపై జనసేనలో క్రమశిక్షణ చర్యలు
జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ పై జనసేనలో క్రమశిక్షణ చర్యలు
నూజివీడు, మార్చి 31: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి సూచనల ప్రకారం పార్టీ నియమాలు, కూటమి ధర్మాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధిగా పేర్కొంటున్న మరీదు శివరామకృష్ణ, అలాగే జనసేన సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్న ముమ్మలనేని సునీల్ కుమార్ నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు లేదా ఇతర కార్యకలాపాలకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే వారు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధులుగా వ్యవహరించరాదని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.