జూన్ నెలాఖరు లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
గత ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణాలు ప్రారంభమై ఇంకా పూర్తి కాని ఇళ్లను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ జి. సత్యనారాయణ లబ్ధిదారులకు సూచించారు. పూర్తి చేసిన ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
శనివారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ, సూరంపాలెం గ్రామాల్లో ఎన్పీఐ, పీఎంఏవై (గ్రామీణ్) 1.0 ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని హౌజింగ్ పీడీ జి. సత్యనారాయణ, ఈఈ రామోజీ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి నిర్మాణ పనులు వేగవంతం చేసి జూన్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ దివ్య, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.