కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ విమర్శలు.. కాగజ్నగర్ సీఎం సభ పూర్తిగా విఫలం
రెండు తప్ప మిగిలిన హామీలన్నీ ప్రజలను మోసం చేయడానికే..
మంచిర్యాల అభివృద్ధిని గాలికొదిలేశారు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్రావు ధ్వజం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కేవలం రెండు మాత్రమే అమలయ్యాయని, మిగిలినవన్నీ ప్రజలను మోసం చేయడానికేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగజ్నగర్లో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభ పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తాను గెలిచిన నాలుగు సీట్లలోనూ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తన స్వలాభం కోసమే కాంగ్రెస్లోని మరో వర్గం వైపు వెళ్లారని మండిపడ్డారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఒక గిరిజన మహిళ తమ గ్రామంలో పాఠశాల, కనీస తాగునీటి సౌకర్యం లేవని ప్రశ్నించడమే ఈ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యమని, క్షేత్రస్థాయి సమస్యలను పక్కనబెట్టి స్థానిక ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. మంత్రుల వద్దే మకాం వేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రఘునాథ్రావు ధ్వజమెత్తారు. గోదావరిపై వంతెన నిర్మాణం, టూ టౌన్ ఫ్లైఓవర్, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ఐటీ కారిడార్ ఏర్పాటుతో పాటు ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం వంటి అంశాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం 80 శాతం పనులు పూర్తి చేశామని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చివరకు ప్రభుత్వ సభలకు జనాలను తరలించేందుకు కనీసం ఫిట్నెస్ లేని బస్సులను ఉపయోగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం తగదని, ఇకనైనా స్వార్థ రాజకీయాలు పక్కనబెట్టి నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు