కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు రోడ్డు పాలు
కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు రోడ్డు పాలు: దావ వసంత సురేష్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం బీఆర్ఎస్ ధర్నా
రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రులకు ఆటల పోటీలా? అని ప్రశ్న
మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతుల జీవితాలు రోడ్డు పాలయ్యాయని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు ఆమె రైతులు, పార్టీ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రభుత్వ తీరుపై నిప్పులు:
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు:
కొనుగోలులో జాప్యం: మొక్కజొన్న పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఇప్పటికే సగం పంట నష్టపోయిన రైతులను, మద్దతు ధర కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ వాయిదా - ఆటల పోటీలా?: రైతుల సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని వాయిదా వేసి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటల పోటీల్లో మునిగిపోవడం ప్రజలతో చెలగాటం ఆడటమేనని ధ్వజమెత్తారు. "రైతులు కన్నీరు పెడుతుంటే, మీకు ఆటల పోటీలు కావాలా?" అని ఆమె ప్రశ్నించారు.
మెస్సీ కోసం కోట్లు - రైతులకు ఏదీ?: ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని తీసుకురావడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, రైతుల పంటను కొనుగోలు చేయడానికి ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు.
కేసీఆర్ పాలనే రైతులకు రక్షణ:
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, సకాలంలో డబ్బులు చెల్లించి 'రైతును రాజు' చేశారని గుర్తు చేశారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పంట నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతి గింజకు బోనస్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ ని తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారని, రెండున్నరేళ్లుగా రైతుల సంక్షేమంపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తోట శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మల్లాపూర్ సర్పంచ్ చిక్యాల లక్ష్మణ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ముద్దం శరత్, పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.