కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేసింది: నడిపెల్లి విజిత్ కుమార్
దండేపల్లి, జూన్ 22: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై రైతులను, ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఆరోపించారు. దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుబంధు, రైతు బీమా, ఆరు గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి చర్యలకు పొంతన లేకుండా పోయిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటల కొనుగోలు జరిగేదని, ప్రస్తుతం రైతులు ఎరువులు, నీరు, విద్యుత్, పంటల విక్రయం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు, మహిళలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన హామీలను అమలు చేసి, రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసిన కృషిని ప్రజలు మరచిపోలేరని విజిత్ కుమార్ అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై పలు ఆరోపణలు చేసిన ఆయన, ఎమ్మెల్యే రూ.500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తాను పలుమార్లు ఆరోపించినప్పటికీ ఇప్పటివరకు స్పందించలేదని పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి మంచిర్యాలగా పేరొందిన నియోజకవర్గాన్ని ప్రస్తుత పాలనలో "మాఫియా మంచిర్యాల"గా మార్చే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ఉద్యమాలకు సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు