నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు!
నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో తీవ్ర కలకలం రేగింది. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా పెద్ద దుమారాన్ని లేపింది. మృతులను మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనాతో పాటు మరో ఇద్దరిగా గుర్తించారు. స్థానికులు తెలిపిన తెలంగాణ కాలనీలోని సదరు ఇల్లు గత కొన్ని రోజులుగా మూసి ఉంచబడింది. అయితే, ఈరోజు ఆ ఇళ్టి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా, లోపల నాలుగు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్నాయి. మృతదేహాలు బాగా దెబ్బతినడాన్ని బట్టి చూస్తే, వారు కనీసం నాలుగు రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో హసీనా స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె భర్త మహమ్మద్ సుల్తాన్ ప్రకాశం బజార్లోని ఒక బ్యాగుల దుకాణంలో వ్యాపారంలో తోడుగా ఉంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. వీరితో పాటు మరణించిన మిగతా ఇద్దరు ఎవరు? వారు వీరి బంధువులా కాదా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా నల్లగొండ అదనపు ఎస్పీ (Addl SP) జి. రమేష్ క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించారు. "ఇది ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. పూర్తి విచారణ జరిపి త్వరలోనే అసలు నిజాలను వెల్లడిస్తామని అని అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. ఈ దారుణ ఘటనతో తెలంగాణ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.