కాంగ్రెస్ రాజ్యసభ సీటును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- బీజేపీ, ఈసీఐ కుమ్మక్కై ‘ఓటు చోరీ’కి పాల్పడుతున్నాయి
- రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకోవడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య విరుద్ధమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న కుంభకోణాల వల్లే ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దేశంలో జరుగుతున్న ‘ఓటు చోరీ’ పై నిరంతరం పోరాడుతున్నారని, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన పవిత్రమైన హక్కులను దొంగిలించి భారతీయ జనతా పార్టీ నాయకులు దొడ్డిదారిన అధికారంలో కూర్చుంటున్నారని విమర్శించారు.
గతంలో ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీలు కుమ్మక్కై నామినేషన్ల పరిశీలన నివేదిక పేరుతో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో, ఇప్పుడు మధ్యప్రదేశ్లో అదే పునరావృతం చేశారని ధ్వజమెత్తారు. అక్కడ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్లో కావాలనే తప్పులున్నాయనే నెపంతో తిరస్కరించడం వారి కుట్రకు నిదర్శనమని ఆరోపించారు. హక్కు ప్రకారం కాంగ్రెస్కు రావాల్సిన సీటును అడ్డుకుని, తిరిగి భారతీయ జనతా పార్టీకే దక్కేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు