కారంపూడి ఎస్సై వేధింపుల ఆరోపణలు.. డీఎస్పీ వివరణ
కారంపూడి ఎస్సై వేధింపుల ఆరోపణలు.. డీఎస్పీ వివరణ
పల్నాడు జిల్లా, గురజాల: కారంపూడి పోలీస్ స్టేషన్ ఎస్సై వేధింపుల కారణంగా ఓ మహిళ పురుగుల మందు తాగిందంటూ ప్రచారంలోకి వచ్చిన ఘటనపై గురజాల డీఎస్పీ మహేశ్వరరావు స్పందించారు. సోమవారం గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్ప అనే వ్యక్తి చిన్నకొదమగుల్ల, పెద్దకొదమగుల్ల, బట్టువారిపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి గుంటూరులో విక్రయించాడు. అయితే రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ.1.50 కోట్ల బకాయిలను ఇప్పటి వరకు చెల్లించకుండా తప్పించుకుంటున్నాడని తెలిపారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే అయ్యప్పపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు, అనంతరం అతడు కోర్టు నుంచి బెయిల్ పొందినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగానే విచారణ నిమిత్తం అయ్యప్పను కారంపూడి పోలీస్ స్టేషన్కు పిలిపించామని, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే విచారణ కొనసాగిందని చెప్పారు.
విచారణ సమయంలో అయ్యప్ప భార్య లక్ష్మి కూడా పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆమె పురుగుల మందు తాగి పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. ఈ ఘటన అనంతరం కారంపూడి ఎస్సై వేధింపుల వల్లే తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, విచారణలో ఎస్సై తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. పోలీసుల లక్ష్యం రైతులకు న్యాయం చేయడం మాత్రమేనని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.