కంచికచర్ల: శానిటేషన్ కార్మికుల 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ వినతి
కంచికచర్ల: శానిటేషన్ కార్మికుల 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ వినతి
ఎంఈఓకు వినతిపత్రం అందజేసిన సీఐటీయూ నాయకులు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ (ఆయా) వర్కర్లకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కంచికచర్ల మండల ఎంఈఓ బాలాజీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మండల నాయకుడు గోపినాయక్ మాట్లాడుతూ.. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ కార్మికులు పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో వీరి సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు.
అయితే ఇంతటి కీలకమైన విధులు నిర్వహిస్తున్న కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, ఆ వేతనాలు కూడా గత నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శానిటేషన్ కార్మికుల్లో ఎక్కువ మంది దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన పేద మహిళలేనని, వారి పరిస్థితిని గుర్తించి పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రతి నెల మొదటి వారంలో క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ కంచికచర్ల మండల నాయకులు బెజ్జం భూషణం, శానిటేషన్ కార్మికులు యశోద, రోజా, శీనమ్మ, రఘు తదితరులు పాల్గొన్నారు.