డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది
డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది: ఎం.ఎ. బేబీ
అగర్తల,: కేంద్రం, త్రిపురలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఆరోపించారు. డీవైఎఫ్ఐ త్రిపుర రాష్ట్ర కార్యదర్శి నబరున్ దేవ్ నివాసాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నబరున్ దేవ్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నబరున్ దేవ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు సెపాహిజాలా జిల్లా కలంచౌరాలో సీపీఐ(ఎం) మద్దతుదారులపై దాడి జరిగిందని, జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకున్నారని పార్టీ నేతలు తెలిపారు.
ప్రజా సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎం.ఎ. బేబీ మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని ఆరోపించారు.
త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారని, సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
గత ఎనిమిదేళ్లలో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని, కేసులు నమోదైనప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదని అన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలకు ముప్పు ఏర్పడుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయని, ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణంగా యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఎం.ఎ. బేబీ పేర్కొన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని, కిడ్నాప్లు, అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.