ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం
మధిర: ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిరలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ జీ. శంకర్ పర్యవేక్షణలో కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి. తౌరియా, ఎస్.కె. షహీన్ బేగం, జీ. విక్రమ్, టీ. నాగరాజు, నీ. అరుణతో పాటు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కళాశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. తరగతి గదుల ముందు ఉన్న చెత్త, మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.
అనంతరం ప్రిన్సిపల్ జీ. శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. వర్షాకాలంలో పిచ్చి మొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది వివిధ రకాల సీజనల్ వ్యాధులకు కారణమవుతాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రతే ప్రధానమని, విద్యార్థులు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ సమాజంలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.