రక్షాబంధన్ ఎప్పుడు కట్టాలి..? తేదీపై స్పష్టత ఇచ్చిన పండితులు
రక్షాబంధన్ ఎప్పుడు కట్టాలి..? తేదీపై స్పష్టత ఇచ్చిన పండితులు
ఆగస్టు 28 శుక్రవారం ఉదయమే రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం..
హైదరాబాద్: సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పంచాంగకర్తలు, పండితులు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 9.08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 9.48 గంటలకు ముగియనుంది. శాస్త్ర ప్రకారం సూర్యోదయ సమయంలో ఉన్న తిథినే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ఆగస్టు 28వ తేదీనే పౌర్ణమిగా భావించాలని పండితులు తెలిపారు.
అంతేకాకుండా ఆగస్టు 27న ఎక్కువ సమయం భద్ర కాలం ఉండటంతో ఆ రోజు రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం వేళ రాఖీ కట్టేందుకు అత్యంత అనుకూల సమయం ఉందని తెలిపారు.
దేశంలోని ప్రాంతాలను బట్టి సూర్యోదయ సమయాల్లో మార్పులు ఉంటాయని పండితులు వెల్లడించారు. ఢిల్లీలో ఉదయం 5.57 గంటల నుంచి 9.48 గంటల మధ్య రాఖీ కట్టవచ్చని సూచించారు. ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో స్థానిక సూర్యోదయ సమయాల ఆధారంగా ముహూర్తాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని, కచ్చితమైన సమయాల కోసం స్థానిక పంచాంగాలను పరిశీలించాలని సూచించారు.
అదే రోజున పాక్షిక చంద్రగ్రహణం ఉన్నప్పటికీ అది భారత్లో కనిపించదని పండితులు తెలిపారు. చంద్రుడు భారత భూభాగానికి సంబంధించి క్షితిజం కింద ఉండటం వల్ల గ్రహణ ప్రభావం ఉండదని, సూతక నియమాలు వర్తించవని స్పష్టం చేశారు.
రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు. సోదర సోదరీమణుల ప్రేమానుబంధాలను మరింత బలపరిచే ఈ పండుగను శుభ సమయంలో జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.