కొండపర్వలో పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఘనంగా
కొండపర్వలో పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఘనంగా
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో భారత జాతీయ జెండా రూపకర్త, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బోట్ల శివ సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి జాతీయ జెండాను రూపొందించి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య తెలుగువారు కావడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని, ఆయన దేశభక్తి, త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు పింగళి వెంకయ్య చూపిన మార్గంలో నడిచి దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో దాసరి శివ, తిరుపతిరావు, సూరిబాబు, సాయి, ధనుష్, మల్లయ్య స్వామి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.