కరెంట్ షాక్తో పెనుగొలను యువకుడు మృతి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన మీనుగు గోపి (26) శనివారం కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం, గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో అబ్బూరి రాంబాబు ఇంటికి రంగులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, గోపి తండ్రి వెంకటేశ్వరరావు కూడా ఏడాది క్రితమే మృతి చెందారు. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన ఏకైక కుమారుడు దుర్మరణం చెందడంతో తల్లి రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది.
ఈ ఘటనపై వాల్మీకి సంఘ నాయకులు, శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు గోపి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.