కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వకపోతే రైతు ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హెచ్చరిక
నేడు ఏలూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
ఏలూరు, ఆగస్టు 2: కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని, లేకపోతే రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ డిమాండ్తో ఏలూరు శివారు సుంకరివారి తోట వంతెన వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో కృష్ణా డెల్టా రైతులు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉండగా వరద జలాలు సముద్రంలో కలుస్తున్నప్పటికీ డెల్టాకు సాగునీరు విడుదల చేయకపోవడం రైతుల పట్ల అన్యాయమని విమర్శించారు. జూన్ 15 నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పి రైతులతో నారుమళ్లు వేయించి, ఇప్పుడు వరి సాగు చేయవద్దని చెప్పడం ప్రభుత్వ వైఫల్యమన్నారు.
పట్టిసీమ, పులిచింతల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఏలూరు మండలంలోని సుమారు 10 వేల ఎకరాలకు పొణంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలు ఎందుకు అందించడం లేదని జలవనరుల శాఖను ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడులు పెట్టి నారుమళ్లు, నాట్లు వేసినందున వెంటనే కృష్ణా తూర్పు కాలువకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన రైతు సంఘం, సోమవారం ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అవసరమైతే రోడ్ల దిగ్బంధనానికి కూడా సిద్ధమని రైతులు స్పష్టం చేశారు.