కృష్ణారావుపాలెం చెక్ పోస్ట్ వద్ద విజిబుల్ పోలీసింగ్ – ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం
ఏలూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ దిశానిర్దేశనలతో, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్.ఐ డి. రామకృష్ణ మరియు వారి సిబ్బంది కృష్ణారావుపాలెం చెక్ పోస్ట్ వద్ద విస్తృత విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడం, నేరాలను నిరోధించడం మరియు భద్రతా భావాన్ని పెంపొందించడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టారు. వాహనదారులు అధిక వేగం, అజాగ్రత్త వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందని పోలీసులు సూచించారు.
ద్విచక్ర వాహనదారులు ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి నాణ్యమైన హెల్మెట్ ధరించాలి అని ప్రత్యేకంగా సూచించారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించే ‘ప్రధాన మంత్రి రాహత్ పథకం’ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేయడంలో వెనుకాడరాదు, ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, ‘గుడ్ సమరిటన్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడడమే పోలీసుల లక్ష్యం అని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్.ఐ డి. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.