తిరువూరులో ఎస్ఎఫ్ఐ భారీ ప్రదర్శన.. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నినాదాలు
తిరువూరులో ఎస్ఎఫ్ఐ భారీ ప్రదర్శన.. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నినాదాలు
తిరువూరు, జూలై 21: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ డిమాండ్లతో నినాదాలు చేశారు.
ఢిల్లీలో నిన్న విద్యార్థులు, యువకులపై జరిగిన దాడిని ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్ష లీకేజీ కారణంగా 20 మంది విద్యార్థులు మరణించారని ఆరోపిస్తూ, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.
అలాగే, ఈ అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం కూడా బాధాకరమని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.