చిన్నంపేటలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహణ
చిన్నంపేటలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో బి శివశంకర్ నిర్వహణ
చాట్రాయి, జూలై 21: చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో మంగళవారం "పొలం పిలుస్తుంది" కార్యక్రమాన్ని ఏవో బి శివశంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నీటి యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం, నీటి లభ్యత క్షీణించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాలు తక్కువగా కురిసినప్పుడు లేదా భూగర్భ జలాలు తగ్గిన సందర్భాల్లో నష్టాలను నివారించేందుకు మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, కంది, పెసర, మినుము, నువ్వులు, ఆముదం, సోయా వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వివరించారు.
అలాగే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా ప్రధానమంత్రి పంట బీమా పథకం (పీఎంఎఫ్బీవై)లో నమోదు చేసుకోవాలని, ఈ-పంటలో తమ పంట వివరాలను నమోదు చేయాలని సూచించారు. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డు (సీసీఆర్సీ) పొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, గ్రామ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, నూజివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సభ్యుడు అత్తులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.