చింతలపూడిలో పోలీసులకు సీపీఆర్పై అవగాహన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ప్రమాద సమయాల్లో ప్రాణరక్షణకు సీపీఆర్ ఎంతో కీలకం
ఏలూరు జిల్లా చింతలపూడి జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చింతలపూడి సర్కిల్ పోలీసు సిబ్బందికి సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ. ప్రియాంక పోలీసులకు సీపీఆర్ చేయాల్సిన విధానం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన వ్యక్తిని కీలకమైన తొలి గంటలో ఎలా రక్షించాలనే అంశాలను వివరించారు.
ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా సీపీఆర్ ప్రక్రియను పోలీసు సిబ్బందికి సులభంగా అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుడికి వైద్య సహాయం అందేలోపు చేపట్టాల్సిన ప్రాథమిక ప్రాణరక్షణ చర్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్నతో పాటు సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు చోటుచేసుకున్నప్పుడు పోలీసులే ముందుగా స్పందించే అవకాశం ఉంటుందని, అలాంటి సమయంలో సీపీఆర్పై అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిపారు.