పోలవరం కోసం 120 ఎకరాల భూమి ఇచ్చిన కరాటం రాంబాబు పులి శ్రీరాములు ప్రశంసలు
ఏలూరు, సెప్టెంబరు 4: రాష్ట్ర ప్రజల జీవనాడిగా నిలిచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డీసీసీబీ మాజీ చైర్మన్, ఏజెన్సీ ప్రముఖుడు కరాటం రాంబాబు చేసిన కృషి ప్రశంసనీయమని కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన జనశిక్షణ సంస్థాన్ మాజీ సంచాలకుడు పులి శ్రీరాములు అభినందించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసిత గ్రామాల తరలింపు సందర్భంగా ప్రభుత్వం భూమికి భూమి అందించాల్సిన పరిస్థితి ఏర్పడిన సమయంలో, నిర్వాసిత కుటుంబాలకు భూమి అందించేందుకు కరాటం రాంబాబు తన కుటుంబానికి చెందిన 120 ఎకరాల భూమిని ముందుగా ప్రభుత్వానికి అందించడం గొప్ప విషయమని పులి శ్రీరాములు పేర్కొన్నారు.
నిర్వాసిత కుటుంబాలకు భూమికి భూమి అందించే విషయంలో రాంబాబు చేసిన సహకారం మరువలేనిదని తెలిపారు. అదేవిధంగా ఆయన డీసీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో నిర్వాసితులు డీసీసీబీకి బకాయి ఉన్న సుమారు రూ.3 కోట్ల రుణాలను రద్దు చేయడం కష్టాల్లో ఉన్న నిర్వాసిత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు.
అభివృద్ధి కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పెద్ద మనసుతో ముందుకు వచ్చిన కరాటం రాంబాబు వంటి అభివృద్ధి ప్రదాత ఉమ్మడి జిల్లాకే గర్వకారణమని పులి శ్రీరాములు ప్రశంసించారు.