మిడుతూరు వద్ద ట్రావెల్ బస్సు దగ్ధం....
మిడుతూరు వద్ద ట్రావెల్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
అనంతపురం జిల్లా: పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైవేపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
బెంగళూరు నుంచి హైదరాబాద్కు 33 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రాథమిక సమాచారం మేరకు విద్యుత్ తీగల్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు బస్సు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే మంటలు తీవ్రంగా వ్యాపించి వాహనం పూర్తిగా కాలిపోయింది.
ఘటనతో హైవేపై కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.