ఖతార్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు – మినీ మహానాడు విజయవంతం
ఖతార్ రాజధాని దోహాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఖతార్ ఆధ్వర్యంలో, మద్దిపోటీ నరేష్ నాయకత్వంలో స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు, మినీ మహానాడు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అల్ ఖోర్, రాస్ లాఫాన్, దుఖాన్, మెసాయిద్, అల్ వక్ర, దోహా ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసులు హాజరై సభను విజయవంతం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతంతో ప్రారంభమైన సభలో కూచిపూడి, భరతనాట్యం, ఎన్టీఆర్ పాత్రలపై సోలో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కొలుసు పార్థసారథి అధికారికంగా విడుదల చేశారు. సభలో దోహా నుంచి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న బ్లూ కాలర్ కార్మికులకు ఏపీఎన్ఆర్టీ సేవలను మరింత విస్తరించాలని వినతిపత్రం అందజేశారు.
ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక “ఎన్ఆర్ఐ గ్రీవెన్స్ సెల్” ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రవాస ఆంధ్రులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
ఖతార్లో 25 ఏళ్లకు పైగా సేవలందించిన తెలుగు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, మినీ మహానాడు సమావేశం ఉత్సాహంగా కొనసాగాయి. కార్యక్రమంలో ఖతార్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.