ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు
లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180.. ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు
తీవ్ర ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచారు. గతంలో ఒక్క బోండా రూపంలో అమ్మిన కొబ్బరి నీళ్లను ఇప్పుడు లీటర్ల రూపంలో విక్రయించడం ఎక్కువైంది. బెంగళూరులో లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180 అంటూ బోర్డులు పెట్టిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా లీటర్ ధర ₹120 నుంచి ₹140 వరకు కొనసాగుతోంది. ఎండలు పెరగడంతో చల్లని పానీయాల కంటే సహజ పానీయాలవైపు ప్రజలు మొగ్గుచూపడం, సరఫరా కొంత తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్క బోండా ధర ₹60 నుంచి ₹100 వరకు ఉండగా, మంచి నీళ్లు వచ్చే బోండాలకు ఇంకా ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.